Kota Srinivasa Rao | డబ్బు కోసం ఇలా చేయడం తప్పు.. కోట శ్రీనివాసరావు కన్నీరు
Kota Srinivasa Rao | నటుడిగా, విలన్ గా, కమెడియన్గా వందలాది సినిమాల్లో నటించారు కోట శ్రీనివాసరావు. తన అద్బుత అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1978లో మొదలైన ఆయన సినిమా ప్రస్థానం 2023 వరకు అప్రతిహతంగా కొనసాగింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లోనూ నటించి మెప్పించారు కోట. సుమారు 750 కు పైగా సినిమాల్లో నటించిన కోటా శ్రీనివాసరావు తన అభినయ ప్రతిభకు ఏకంగా తొమ్మిది నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ సత్తా చాటారాయన. 1999 నుండి 2004 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు.

కాగా గత రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు కోట. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు తోడవ్వడంతో ఇంటికే పరిమితమయ్యారు. ఆయన చివరగా 2023లో వచ్చిన ‘సువర్ణ సుందరి’ మూవీలో కనిపించారు. ఆ తర్వాత బయట కూడా పెద్దగా కనిపించలేదీ సీనియర్ నటుడు. అది పక్కన పెడితే ఎవరైనా సెలబ్రెటీ ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో జాయిన్ అయితే చాలు వారు చనిపోయారంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో ఫలానా ప్రముఖులు తామే బతికే వున్నామని .. తప్పుడు వార్తలు నమ్మొద్దంటూ స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. తాజాగా ఈ లిస్ట్లోకి సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు చేరారు.
Also Read : ఓ బ్యాంక్ మేనేజర్ కోసం.. పెళ్లైన నెల రోజులకే కొత్త అల్లుడు హత్య..
డబ్బు కోసం అలాంటి పోస్టులా
కోటా మరణించారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వార్త క్షణాల్లో వైరల్ అయ్యింది. అసలే కే. విశ్వనాథ్, జమున, తారకరత్నల మరణాలతో తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయిన చిత్ర పరిశ్రమ ఈ వార్తతో ఉలిక్కిపడింది.అయితే కాసేపటికే ఇది తప్పుడు వార్తని తేలింది. కోటా శ్రీనివాసరావు పూర్తి ఆరోగ్యంతో వున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఆ కాసేపటికీ కోటా రంగంలోకి దిగారు. ఓ వీడియో విడుదల చేసిన ఆయన ఇలా అన్నారు. ‘‘ అందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. ఏం లేదండి.. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరో సోషల్ మీడియాలో వేశాడట నేను పోయానని.

కోటా శ్రీనివాసరావు దుర్మరణమని.. అలాంటి వార్తలు నాకు తెలియదు. తెల్లారి పండగ, ఏం చేయాలి అని మాట్లాడుకుంటుండగా .. పొద్దున 7.30 నుంచి ఇప్పటి వరకు నేను 50 ఫోన్లు మాట్లాడా. మా కుర్రాడు మాట్లాడాడు. ఆశ్చర్యం ఏంటంటే పోలీసులు వచ్చేశారు. మీకు నివాళులర్పించడనాికి ప్రముఖులు వస్తారు కదా సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చాం అని పోలీసులు చెప్పారు. ఇలాంటి వార్తలు నమ్మొద్దని మనవి చేసుకుంటూ .. ప్రజలు కూడా గట్టిగా రియాక్ట్ అవ్వాలి. డబ్బు సంపాదించడానికి బోల్డన్నీ పనులు వున్నాయి. మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు.. నమస్కారం.’’ అంటూ కోటా ముగించారు.










