Maha Shivratri | శివరాత్రి నాడు ఉపవాసం చేయడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా ..?
శివరాత్రి శివ భక్తులకే కాకుండా యావత్ భారత ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు. రాత్రంతా మేలుకుని జాగరణ చేసి శివ పూజలలోనూ, శివ భజనలలోనూ లీనమై ఉంటారు. శివుడికి అభిషేకాలు, పూజలు శివరాత్రి రోజు జరుగుతాయి అలాగే శివరాత్రి రోజున చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు. అసలు ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం మనల్ని భగవంతుడికి దగ్గరగా ఉంచడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సైతం ఉపయోగపడుతుంది. ఉపవాసం అనేది మనిషి నిశ్చలంగా ఉంచడంతో పాటు మనసుని శుద్ధి చేస్తుంది.
ముఖ్యంగా శివరాత్రి నాడు తప్పక హిందువులంతా ఉపవాసం చేసి.. జాగారం చేస్తారు. శివరాత్రి వంటి పర్వదినాల్లో ఉపవాసం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే మనసు, శరీరం స్థిరంగా ఉంటాయని నమ్మకం. అలాగే మనం చేసే ఉపవాసం.. ధ్యానం, మంత్రోచ్ఛారణలు ఆందోళన, చంచలత్వం వంటి మనోవికారాలను తగ్గిస్తుందని నమ్మకం.ఉపవాసం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. అలాగే మన శరీరంలో జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.

అలాగే జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇవ్వడం వలన జీర్థాశయం ఉత్తేజితమవడంతో పాటు జీర్ణ ప్రక్రియ మెరుగు పడుతుంది. మెదడు పనితీరు సైతం మెరుగుపడి ఏకాగ్రత, సంకల్ప శక్తి పెరుగుతుదని చెబుతారు. ఈ క్రమంలోనే మన శరీరంలోని ఇన్సులిన్ నియంత్రణ జరగడంతో పాటు రక్త పోటును సైతం క్రమబద్దం చేస్తుంది. హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వారికి ఉపవాసం ఉండటం వలన చాలా మంచిది. మహాశివరాత్రి రోజు మంత్ర జపం, ధ్యానం, జాగరణ చేయడం వల్ల ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. మొత్తానికి ఆధ్యాత్మికంగానూ.. శారీరకంగానూ ఉపవాసం చాలా మంచిది.
ఆర్థిక బాధలు..
అలాగే శివరాత్రి రోజు పెరుగులో తేనె కలిపి శివ లింగానికి అభిషేకం చెయ్యాలి. శివుడిని అభిషేక ప్రియుడు అని అంటారు. పెరుగులో తేనె కలిపి అభిషేకం చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడు. ఈ పని చేయడం వల్ల శివుడి ఆశీర్వాదం లభించి మద్యలో ఆగిపోయిన పనులు తిరిగి పూర్తీ అవుతాయట.శివ పూజకు బిల్వపత్రం చాలా ముఖ్యం. ఈ రోజు బిల్వ పత్రం, పూలు, పండ్లు, పాలు, చందనం సమర్పించాలి. ఇలా చేస్తే పూజ చేసే వారి మీద శివుడి అనుగ్రహం ఉంటుంది.

శివుడు నిరాడంబరుడు, ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు. ప్రతి నెలా మాస శివరాత్రి రోజు నిరుపేదలకు, బీద వారికి, సహాయం కోసం ఎదురు చూస్తున్నవారికి పాలు, పండ్లు, పప్పు ధాన్యాలు, బియ్యం వంటి నిత్యవసరాలు దానం చెయ్యాలి. ఇలా చేస్తే జీవితంలో దేనికి లోటు ఉండదట.ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇంట్లో డబ్బు కొరత ఎదుర్కొంటున్నవారు ఇలా పేదలకు దాననం చేయడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి బలపడి జీవితంలో పురోగతి లభిస్తుందట.










