Jagannath Rath Yatra | అసలు ఏం జరుగురుంది.. పూరీ యాత్రలో విషాదం.. ఇప్పటివరకు ముగ్గురి మృతి?
Jagannath Rath Yatra | ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీ క్షేత్రానికి తరలివచ్చారు. జై జగన్నాథ అంటూ భక్తుల నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతోంది. ఈ పండుగను ఏటా ఆషాడ మాస శుక్లపక్ష విదియ నాడు జరుపుతారు.ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలను చూసేందుకు పూరీకి చేరుకుంటారు. రథయాత్ర సమయంలో, భగవంతుడిని శ్రీమందిర్ నుంచి బయటకు తీసుకువచ్చి శ్రీ గుండిచా ఆలయానికి తీసుకువెళతారు. అక్కడ ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటారు. ఈ ప్రయాణ సమయంలో తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. శనివారం రథయాత్ర ప్రారంభంలో కూడా తొక్కిసలాట జరిగి 500 మందికి పైగా భక్తులు గాయపడ్డారు.

అలాగే గుండిచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు రథయాత్ర ఆలస్యం కావడంపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారం చెలరేగింది.ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో రథాలు గుండిచా ఆలయం వద్దకు రాగానే, స్వామివార్ల దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. రథాలు సమీపించే కొద్దీ ఒక్కసారిగా జనసందోహం పెరిగిపోయింది. ఈ క్రమంలో కొందరు భక్తులు కిందపడిపోవడంతో తొక్కిసలాట జరిగింది.ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
రథయాత్ర ఆలస్యం
Also Read: మీకు తెలుసా .. ఈ చిన్న వ్యాపారంతో నెలకు రూ.12 లక్షలు సంపాదన..!!
మృతులను ప్రభాతి దాస్, బసంతి సాహు, ప్రేమకాంత్ మహంతిగా గుర్తించారు. వీరంతా పూరీ రథయాత్ర కోసం ఖుర్దా జిల్లా నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన ప్రదేశంలో గుంపును నియంత్రించడానికి పోలీసులు సరైన ఏర్పాట్లు చేయలేదని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.ఇక, రథయాత్ర ఆలస్యం కావడంపై రాజకీయ వివాదం రాజుకుంది. బీజేడీ అధినేత, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఈ పరిస్థితిని దారుణమైన గందరగోళంగా అభివర్ణించారు. “మనం చేయగలిగింది ప్రార్థించడం మాత్రమే. ఈ ఏడాది ఈ దివ్యమైన ఉత్సవానికి నీలినీడలు అలుముకునేలా చేసిన ఈ గందరగోళానికి బాధ్యులైన వారందరినీ మహాప్రభు జగన్నాథుడు క్షమించాలి” అని ఆయన అన్నారు.

నవీన్ పట్నాయక్ వ్యాఖ్యలపై ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథివిరాజ్ హరిచందన్ పరోక్షంగా స్పందించారు. బీజేడీ అనవసరంగా రాజకీయ ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. “గతంలో బీజేడీ ప్రభుత్వం తప్పులు చేసి జగన్నాథుడిని అవమానించింది. 1977 నుంచి రథాలు ఎప్పుడూ రెండో రోజే గుండిచా ఆలయానికి చేరుకునేవి” అని ఆయన తెలిపారు.సంప్రదాయం ప్రకారం జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలతో కూడిన రథాలను గుండిచా ఆలయానికి తీసుకువస్తారు. అక్కడ దేవతలు వారం రోజుల పాటు బస చేసి, ఆ తర్వాత తిరిగి జగన్నాథ ఆలయానికి చేరుకుంటారు. అయితే, ఈసారి యాత్ర ఆలస్యం కావడం, తొక్కిసలాట జరగడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.










