Mithun Reddy | షాకింగ్ మిథున్ రెడ్డిని కటిక నేలపై పడుకోబెట్టిన జైలు అధికారులు.
Mithun Reddy | గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (ఏ4)కి రిమాండ్ ఖైదీ నంబరు 4196 ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్ర కారాగారంలో గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న స్నేహ బ్యారక్లో ఆయన్ను ఉంచారు. ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకూ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఆయన్ను అదే రోజు రాత్రి పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. రాత్రి 8.50 గంటలకు అడ్మిషన్ తీసుకున్నామని సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు.
జైలు మెడికల్ అధికారితో ఆయనకు ఆరోగ్య పరీక్షలు చేయించగా ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయిలో ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టులో రెండు పిటిషన్లు వేశారు. ఇంటి భోజనం, ఒక అటెండర్, కెన్లీ వాటర్ బాటిళ్లు, కొత్త పరుపు, కొత్త మంచం, వెస్ట్రన్ కమోడ్తో ప్రత్యేక గది ఇప్పించాలన్నారు. అలాగే ఒక టీవీ, న్యూస్ పేపర్స్, దోమతెర, వాకింగ్ షూ అందించాలని కోరారు. ప్రొటీన్ పౌడర్, టేబుల్, పెన్నులు, పేపర్లు కూడా అందించాలని అభ్యర్థించారు.

మంచం ఇవ్వలేదు
మిథున్ రెడ్డికి జైలు అధికారులు మంచం ఇవ్వలేదని, నేలపైనే పడుకోబెట్టారని వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు ఏసీబీ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రాజమండ్రి జైలు సూపరింటెండెంట్తో మాట్లాడాలని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదేశించారు. మంగళవారం కోర్టులో జైలు సూపరింటెండెంట్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. తన తరఫున డీఎస్పీ స్థాయి అధికారిని కోర్టుకు పంపుతానని జైలు సూపరింటెండెంట్ జవాబు ఇచ్చారు. దీంతో విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.










