Thalliki Vandanam | తల్లికి వందనంలో మీకు డబ్బులు పడలేదా.. అయితే ఇలా చెయ్యండి?

Thalliki Vandanam | కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీల్లో మరో కీలక పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున నిధులు విడుదల చేయనుంది. మొత్తం 67,27,164 మంది విద్యార్థుల తల్లులకు రూ.8,745 కోట్లు గురువారం జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి రూ.1,000, పాఠశాల నిర్వహణ నిధి కోసం మరో రూ.1,000 చొప్పున మినహాయించి మిగిలిన రూ.13 వేలు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు. ఈ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షించారు. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయాలన్నారు. పథకానికి నిధుల ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను సీఎం ఆదేశించారు.

డబ్బులు జమ అయ్యాయా

ఇప్పటికే గుర్తించిన విద్యార్థులతో పాటు ఒకటో తరగతిలో, ఇంటర్‌ ఫస్టియర్‌లో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు కూడా పథకం అమలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే మిగిలిన రూ.2వేలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమ చేస్తోంది ప్రభుత్వం.మరోవైపు తల్లికి వందనం పథకం డబ్బులు జమ అయ్యాయా?.. లేదా? స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంచింది.. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పథకం అనే ఆప్షన్ దగ్గర తల్లికి వందనం సెలక్ట్ చేసుకోవాలి. 2025-26 సంవత్సరాన్ని సెలక్ట్ చేసి.. ఆధార్ నెంబర్, క్యాప్చాను ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయగానే లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.

Thalliki Vandanam
Thalliki Vandanam

ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అంతేకాదండోయ్ వాట్సాప్ ద్వారా కూడా తల్లికి వందనం స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 9552300009 నంబర్‌కు Hi మెసేజ్ చేయగానే అక్కడ సేవలన్నీ వస్తాయి.. వాటిలో ఆప్షన్స్ ఎంపిక చేసుకుంటే తల్లికి వందనం స్టేటస్ చెక్ ఆప్షన్‌ను ఎంచుకుని ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే స్టేటస్ తెలుసుకోవచ్చు.ఒకవేళ వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా స్టేటస్ తెలియకపోతే.. తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులు, అనర్హుల జాబితాలను రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.

ఆ జాబితాలో చెక్ చేసుకోవచ్చు.. ఒకవేళ ఈ జాబితాపై అభ్యంతరాలున్నా, అర్హత ఉండి డబ్బులు జమ కాకపోయనా, ఏవైనా ఫిర్యాదులు ఉంటే స్వీకరిస్తారు. అయితే అనర్హులుగా తేలిన మరికొందరు లబ్ధిదారులకు సంబంధించి హౌస్‌హోల్డ్‌ డేటా లేదు.. ఈ మేరకు అందులో తప్పుల్ని సరిచేసి డబ్బుల్ని జమ చేస్తారు. తల్లికి వందన పథకానికి సంబంధించి ఫిర్యాదుల్ని జూన్‌ 12 నుంచి 20 వరకు స్వీకరిస్తారు. గ్రీవెన్స్‌ పరిశీలన, అదనపు జాబితాను జూన్‌ 21-28 మధ్య రెడీ చేస్తారు. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్‌ ఫస్టియర్ అర్హులైన విద్యార్థుల జాబితాను జూన్‌ 30న ప్రదర్శిస్తారు. వీరందరికి జులై 5న డబ్బుల్ని జమ చేస్తారు.

తల్లికి వందనం పథకం అంటే ఏమిటి?

పేద పిల్లలు చదువును మధ్యలోనే ఆపకుండా కొనసాగించేందుకు తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ఈ సాయం అందిస్తారు. ఇందులో విద్యార్థికి రూ.13,000 ఇవ్వగా.. పాఠశాల/ కాలేజీ నిర్వహణ (అభివృద్ధి)కి రూ.2000 కేటాయిస్తారు. విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని తల్లి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తారు. తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో ఈ మొత్తం జమ చేస్తారు.

Leave a Comment