తిరుమల: టీటీడీ కీలక నిర్ణయం! భక్తుల ఇబ్బందులకు చెక్
తిరుమల: టీటీడీ కీలక నిర్ణయం! భక్తుల ఇబ్బందులకు చెక్

తిరుమల: తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వేసవి రద్దీ వేళ ముందస్తుగానే టీటీడీ చర్యలు చేపట్టింది. అయితే, రద్దీ విషయంలో అంచనాలు తప్పాయి.
దీంతో, సిఫారసు లేఖలను తొలుత రద్దు చేయగా ఇప్పుడు పునరుద్దరించారు. ప్రస్తుతం రద్దీ కొంత పెరిగింది. ఇదే సమయంలో తిరుమలలో దర్శనంతో సహా సేవల విషయంలో కీలక సంస్కరణలకు టీటీడీ శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగా ఏఐ ఆధారిత దర్శనం కోసం ప్రతీ భక్తుడుకు శాశ్వత ఐడీ. అలిపిరి వద్దే వసతి, టికెట్ కౌంటర్ల ఏర్పాటుకు నిర్ణయించారు.
టీటీడీ విజన్-2047 అమలు దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది. అందులో భాగంగా అలిపిరి వద్దే బేస్ క్యాంప్ ఏర్పాటుకు నిర్ణయించారు. 15 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం అయ్యాయి. అలిపిరి వద్దే ప్రయివేటు వాహనాలను నిలిపి ఎలక్ట్రిక్ బస్సుల్లో కొండ పైకి తీసుకెళ్లనున్నారు. అలిపిరి వద్దే వసతితో పాటుగా అన్ని కౌంటర్ల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.
అలిపిరి వద్ద బేస్ క్యాంపు తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ మరో ప్లాన్ అమలుకు సిద్దమైంది. తిరుమలలో రోజుకు సగటున 68 వేల మంది భక్తులతో పాటు 20 వేల మంది స్థానికులకు నీటి, విద్యుత్ వనరులు సమకూర్చడం కూడా కష్టంగా మారుతోంది. వాహన కాలుష్యం పెరుగుతోంది. దీంతో, అలిపిరి బేస్ క్యాంపు కు శ్రీకారం చుడుతున్నారు.
వసతి - కౌంటర్లు: తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీ తగ్గించేందుకు వీలుగా కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు. భక్తులకు సౌకర్యాలతో పాటుగా వాహన రద్దీ, కాలుష్యం తగ్గించేలా బేస్ క్యాంపులో సౌకర్యాలు కల్పిస్తున్నారు. తిరుమలలో 7,790 టీటీడీ గదులు, 1,105 మఠా ల గదులు, 6,800 లాకర్లు ఉన్నాయి. వీటి ద్వారా కేవలం 55 వేల మందికి మాత్రమే వసతి కల్పించే అవకాశం ఉంటోంది. మిగిలిన భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు.
ఈ సవాళ్లను ఎదుర్కోవడం కోసమే టీటీడీ బేస్క్యాంప్ ప్రాజెక్ట్పై ప్రధాన దృష్టిసారించింది. తిరుమల విజన్- 2047లో భాగంగా అలిపిరిలో బేస్క్యాంప్ను ఏర్పాటు చేయాలని భావించి ప్రత్యేక శ్రద్ధతో ప్రాజెక్ట్ను సిద్ధం చేశారు. దీనికోసం 10 నుంచి 15 హెక్టార్ల స్థలాన్ని వినియోగించనున్నారు. గతంలో వివిధ హోటళ్లకు ఇచ్చిన స్థలాన్ని కూడా రద్దు చేసి టీటీడీకే కేటాయించడంతో బేస్క్యాంప్కు లైన్ క్లియర్ అయింది.
బేస్ క్యాంపు ద్వారా: ప్రతిపాదిత క్యాంపులో 25 వేల మంది భక్తులకు సకల సౌకర్యాలతో వసతి కల్పించేదిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి చేరే ప్రైవేట్ వాహనాలను ఈ బేస్క్యాంప్కు మళ్లించి వాటిలో వచ్చిన భక్తులను టీటీడీ, ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా తిరుమలకు పంపేందుకు ప్రత్యేక కేంద్రం.. మోడల్ ట్రాన్స్ఫర్ టెర్మినల్ ఏర్పాటు చేస్తారు.
భక్తులు విశ్రాంతి తీసుకునేం దుకు, స్నానాలు చేసేందుకు, భోజనం హాళ్లు, లాకర్లు వంటి సదుపాయాలు కల్పిస్తారు. ఇక, భక్తులకు వసతి కేటాయింపు కార్యాలయాలతో పాటు వివిధ రకాల కౌంటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మ్యూజియం, కళాప్రదర్శన కేంద్రం, ఆధ్యాత్మికతను పెంచేలా వివిధ రకాల ఏర్పాటు ఉంటాయి. ప్రణాళికలు ఖరారు కావటంతో సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది.
What's Your Reaction?






